యాదాద్రి జిల్లాలో దర్జాగా మట్టి దందా.. ప్రభుత్వ ఆదాయానికి గండి

యాదాద్రి జిల్లాలో దర్జాగా మట్టి దందా.. ప్రభుత్వ ఆదాయానికి గండి
  • దర్జాగా మట్టి దందా ప్రభుత్వ ఆదాయానికి గండి
  • అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు
  • టిప్పర్లతో వేల టన్నుల మట్టి తరలింపు
  • తాజాగా 23 టిప్పర్లను పట్టుకున్న ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు : జిల్లాలో మట్టి అక్రమ దందా దర్జాగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రిప్పర్లతో వేలాది టన్నుల మట్టిని తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తాజాగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. ఇటుకల తయారీ కోసం అవసరమైన మట్టిని ఎక్కువగా చెరువుల నుంచి సేకరిస్తుంటారు. ఈ మట్టిని సేకరించాలంటే ఇరిగేషన్, మైనింగ్​తోపాటు రెవెన్యూ డిపార్ట్​మెంట్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ఎన్​వోసీ ఇచ్చిన తర్వాత మైనింగ్ ​డిపార్ట్​మెంట్​నిబంధనలతో కూడిన అనుమతి ఇస్తోంది. ఎన్ని క్యూబిక్ మీటర్ల లోతు తవ్వాలో..? ఎన్ని టన్నులు తీసుకెళ్తారనే సమాచారం తెలుసుకొని అనుమతి ఇస్తుంది. ప్రతి టన్నుకు రూ.20 చొప్పున రాయల్టీ, దానికి వివిధ పన్నులు కలిపి ముందుగానే చెల్లించాల్సిన అమౌంట్​ను తీసుకుంటుంది. ఆ తర్వాతే మట్టి తవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుంది. 

అనుమతులు లేకుండానే..

అనుమతులు తీసుకున్న వారు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తీసుకున్న అనుమతులను మించి మట్టిని తోడేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మరికొందరు ఏకంగా ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తవ్వేస్తున్నారు. మట్టి తవ్వకాల కోసం ఏకంగా జేసీబీలు, హిటాచీలను తీసుకొస్తున్నారు. వాటి ద్వారా ఇష్టమొచ్చినట్టుగా మట్టిని తవ్వేస్తూ  టిప్పర్ల ద్వారా దూరప్రాంతాలకు తరలిస్తూ ఒక్కో టిప్పు మట్టిని రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఇటుకల తయారీదారులకు అమ్ముకుంటున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన ఆఫీసర్లు కొందరు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

టిప్పర్ల పట్టివేత, కేసు నమోదు.. 

జిల్లాలోని రాజాపేట మండలం చల్లూరులో పేదలకు చెందిన భూమి చెరువు సమీపంలో ఉంది. దీంతో ఆ భూమి నుంచి మట్టి తరలించుకోవడానికి కొందరు వ్యక్తులతో మాట్లాడి ఎకరాకు రూ.4 లక్షలకు పైగా డబ్బు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్​గా రూ.2 లక్షలు చెల్లించినట్టుగా తెలుస్తోంది. 30 టిప్పర్లు, రెండు హిటాచీలను రంగంలోకి దించి.. పెద్ద ఎత్తున మట్టిని దొడ్డిదారుల్లో సిద్దిపేట సహా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టికి రూ.8 వేలకు చొప్పున అమ్ముకునట్టుగా తెలుస్తోంది.

ఈ విధంగా గడిచిన పది రోజులుగా రోజుకు వంద ట్రిప్పులకు పైగా టిప్పర్లతో తరలించినట్టు ప్రచారం సాగుతోంది. చివరకు ఈ విషయం బయటపడడంతో ఆఫీసర్లు రంగంలోకి దిగి గురువారం టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేశారు. అయితే మట్టి తవ్వడానికి వచ్చిన హిటాచీలను అప్పటికే తప్పించేశారు. కాగా పట్టుకున్న వాటిలో ఏడింటిని తప్పించి 23 టిప్పర్ల ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఉన్న వాటిలో ఒక్కో టిప్పర్​కు రూ.5,342 చొప్పున మైనింగ్ డిపార్ట్​మెంట్ జరిమానా విధించింది. 

 ఇటీవల వెలుగులోకి వచ్చిన మట్టి దందా వ్యవహారాలు..

ఈ ఏడాది ఆరంభంలో తుర్కపల్లి మండలంలోని గండి చెరువు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద ఎత్తున మట్టిని తోడేశారు. 15 రోజుల తరబడి తవ్వకాలు జరిపిన తర్వాత కేసులు నమోదు చేశారు. అనంతరం ఫైన్​ విధించారు. మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడెం– చాడ గ్రామాల మధ్య పెద్ద చెరువు నుంచి మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అయితే మూడుసార్లు కలిపి 52,500 టన్నుల మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకొని అంతకు మించి ఎన్నో రెట్లు మట్టిని తోడేసి టిప్పర్ల ద్వారా వ్యవసాయ భూముల్లో పెద్ద పెద్ద గుట్టలుగా పోసి నిల్వ చేశారు.  

కేసు నమోదు చేశాం 

చల్లూరులో మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని సీజ్ ​చేశాం. టిప్పర్ డ్రైవర్లు, ఓనర్లపై కేసు నమోదు చేశాం. వారిని విచారిస్తే మట్టి తరలింపు వెనుక ఎవరి హస్తం ఉందో తెలుస్తుంది. వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం.‌‌‌‌‌‌‌- కృష్ణారెడ్డి, ఆర్డీవో, భువనగిరి